జనసేన పార్టీని స్థాపించి ఐదు ఏళ్ళు దాటినా విధానాల పట్ల, రాజకీయ లక్ష్యాల పట్ల ఇంకా స్పష్టత లేదు. స్థాపకుడు మరియు అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారు సైద్ధాంతిక అయోమయంలోనే కొట్టుమిట్టాడుతున్నారు. ఆయన తానా సభ సందర్భంగా చేసిన ప్రసంగంలో ఈ రకమైన ద్వైదీభావం కొట్టొచ్చినట్లు కనిపించింది.
- పవన్ ప్రసంగంలో ప్రతిసారి మహానాయకుల పేర్లు చెప్పి ఆదర్శాలు వల్లించడం కనిపిస్తుంది. కాని ఆ మహానాయకుల పేర్లు మారుతూనే ఉంటాయి. ఈసారి ఆయన గాంధీ, థామస్ అల్వా ఎడిసన్, నెల్సన్ మండేలా, వివేకానందుల పేర్లు ప్రస్తావించారు.
- విద్యా విధానం తన ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా లేదని చదువంటే ఇష్టం పోయి కొనసాగించలేకపోయారట, కాని, ఖుషీ తరువాత సినిమాల మీద ఆసక్తి లేకపోయినా కొనసాగించారట. ఆయనకు చదువు మీద లేని జాలి, సినిమాల మీద ఎందుకో?
- ఓటమి తనను బాధించలేదని చెబుతూనే, పలుమార్లు గెలుపోటముల గురించి ప్రస్తావించారు. జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్లి వచ్చాడని ఎద్దేవా చేశారు.
- తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల ఆయన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. ఆయన చిన్నతనంలో స్నేహితుడు తెలంగాణ వెళితే అవమానించారంటూ ఇప్పుడు ఆరోపణలు చేశారు. కాని ఆయన మాత్రం తెలంగాణ వెళ్లి అక్కడే సెటిలయ్యారు.
- కులాలపై, తెలంగాణపై ప్రస్తావన వస్తే పవన్ గారికి దేశ సమగ్రత, ఐకమత్యం గుర్తుకువస్తుంది. అదే బిజెపి ప్రస్తావన వచ్చినప్పుడు మాత్రం దక్షిణాదికి అన్యాయం వంటి ఆరోపణలు గుర్తుకు వస్తాయి.
- ఇప్పటివరకు పార్టీ సిద్ధాంతాల పట్ల, రాజకీయ విధానాల పట్ల స్పష్టతను ఇవ్వలేకపోయారు గాని సిద్ధాంతాల కోసం పాటుపడతారట మరియు ఎన్ని బాధలైనా పడతారట.
- ప్రసంగంలో భాగంగా తాను ఎవరికీ గులాంగిరి చేయనని అన్నారు. చేయమని ఎవరైనా బలవంత పెట్టారా? లేక ఇంతకు ముందు పెట్టుకున్న పొత్తులు గులాంగిరీలా అనిపించాయా? లాంటి విషయాలపై స్పష్టత ఇవ్వలేదు.
Post a Comment