అసంబద్ధ అంచనాలు, అతిశయోక్తులతో కూడిన కేటాయింపులు


నమ్మకం, విశ్వసనీయత కారణాలతో ప్రజలు తీర్పు ఇచ్చారని, వాటిని నిలబెట్టుకుంటామని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. కాని, ఆయన పేర్కొన్న ఆదాయ అంచనాలు అసంబద్దంగా, కేటాయింపులు అతిశయోక్తులతో కూడినవిగా ఉన్నాయి.
  • మద్యం నియంత్రిస్తామని చెప్పిన ప్రభుత్వం, ఈ ఏడాది ఎక్సయిజ్ ఆదాయం ఏకంగా రెండు వేల కోట్లు పెరిగి 8,518 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. గత ఏడాది సవరించిన అంచనాల తరువాత 6220 కోట్ల రూపాయల ఆదాయం లభించింది.    
  • రాష్ట్ర ప్రజల నుంచి వివిధ పన్నుల రూపంలో 75,437 కోట్ల రూపాయలు వస్తాయని బడ్జెట్‌లో అంచనా వేశారు. 2018-19 సవరించిన అంచనాతో పోల్చితే ఇది ఏకంగా 17 వేల కోట్లు ఎక్కువ. గత ఆర్థిక సంవత్సరం చంద్రబాబు సర్కారు ప్రజల నుంచి పన్నుల రూపంలో 65,535 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేయగా, 58,125 కోట్లకు మాత్రమే పరిమితమైంది. ప్రభుత్వం కొత్త పన్నులను ఏమైనా వేయనుందా? లాంటి విషయాలపై బడ్జెట్లో స్పష్టత ఇవ్వలేదు.   
  • కేంద్రంతో ఎంత సత్సంబంధాలు ఉన్నా గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ రూపంలో ఏకంగా 61,071 కోట్లు వస్తాయని చూపించారు. 2018-19లో కూడా ఇదే విధంగా  50,695 కోట్లు అంచనా వేయగా, వచ్చింది 19,456 కోట్లు మాత్రమే. అంటే గత సంవత్సరం కేవలం 20వేల కోట్లు మాత్రమే ఇచ్చిన కేంద్రం ఈసారి అరవై వేల కోట్లు ఇస్తుందని ఎలా అనుకున్నారో? ఈ విషయాన్ని గమనిస్తే, కొత్త ఆర్ధిక మంత్రి రాష్ట్ర ఆదాయంపై సరిగ్గా కసరత్తు చేయలేదనిపిస్తుంది. గత సంవత్సరం కేటాయింపులనే కొంత శాతం మేర పెంచి, ఈ సంవత్సరం ఆదాయంగా చూపించారు.     
మనది రెవిన్యూ లోటు ఉన్న రాష్ట్రం. అంటే రాష్ట్ర ఆదాయం మరియు కేంద్ర కేటాయింపులు కలిపినా ఉద్యోగుల వేతనాలకు, ప్రభుత్వ నిర్వహణకు సరిపోవు. ఇలాంటి పరిస్థితులలో కొత్త పథకాలు ప్రవేశపెట్టి మరీ, భారీగా కేటాయింపులు జరిపారు. నిబంధనల ప్రకారం, ఆ కేటాయింపులకు సరిపడా అప్పులు తెచ్చుకునే వెసులుబాటు కూడా లేదు. ఆర్థిక సంవత్సరం చివరకు వచ్చేసరికి భారీగా పన్నులు వేయడమో, కేటాయింపులలో కోతలు కోయడమో చేయక తప్పదు.   

1/Post a Comment/Comments

  1. బడ్జెట్ ప్రవేశపెట్టాలి కాబట్టి ఏదో పెట్టారు. పరిపాలన చేయాలి కాబట్టి చేస్తున్నాం అంటున్నారు. ఈ ప్రభుత్వాలు చేసేది పెత్తనం కాని పరిపాలన కాదు. ప్రజలెట్లా పోతేనేం. వీళ్ళకి కావలసినది వీళ్ళు సంపాదించుకుంటారు. ఎన్నికల్లో ఓట్లు కావాలంటే మంచి పాలకులు కావాలన్న నియమం ఉందనుకోవటం జనం భ్రమ. ఓట్లు దండుకుందుకు రాజకీయులకు వాళ్ళ ఉపాయాలు వాళ్ళకుంటాయి. వాళ్ళ ఎత్తులూ పైయెత్తుల్లో చిత్తయ్యేది చివరికి జనమే.

    ReplyDelete

Post a Comment

Previous Post Next Post