మహిళలకు, ప్రభుత్వ రవాణా వ్యవస్థలలో ఉచిత ప్రయాణానికి వీలు కల్పించనున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు. ఇది ఢిల్లీ మెట్రో మరియు బస్సులు రెండింటిలో వర్తిస్తుందని, మూడు నెలల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో మహిళల భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని ఆయన అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం కోసం ఏటా 700 కోట్లు ఖర్చు చేయనుంది. ఢిల్లీ మెట్రోలో 50%వాటా కేంద్ర ప్రభుత్వానిది కావడం వలన ఈ పథకాన్ని కేంద్రం కూడా ఆమోదించవలసి ఉంది. రాష్ట్రంలో కరంట్ బిల్లులు తగ్గించడానికి కూడా రెగ్యులేటరీ బోర్డుతో కూడా చర్చలు జరుపుతున్నామని కేజ్రీవాల్ తెలిపారు.
ఢిల్లీలో అధికారంలో ఉన్న కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్-ఆద్మీ-పార్టీ, ఇటీవలి లోక్ సభ ఎన్నికలలో అన్ని స్థానాల్లోనూ ఓడిపోవడంతో ఈ నిర్ణయం చర్చనీయాంశమయింది. బిజెపి రాష్ట్ర అద్యక్షుడు మనోజ్ తివారి ఇది ఎన్నికల గిమ్మిక్ అని, ఓట్ల కొనుగోలుకు ఇప్పడినుండే సిద్ధమవుతున్నాడని విమర్శించారు.
సోషల్ మీడియాలో కామెంట్ల వెల్లువ
కేజ్రీవాల్ నిర్ణయంపై ప్రశంసల కన్నా విమర్శలే ఎక్కువ వస్తున్నాయి.
ఈ నిర్ణయం వల్ల ఢిల్లీలో ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించడం పెరుగుతుందని, దాని వలన వాయు కాలుష్యం తగ్గవచ్చని కొందరు వ్యాఖ్యానించారు. మరికొందరు పేద, మధ్య తరగతి మహిళలకు ఈ పథకం ఉపయోగపడవచ్చని అన్నారు. ఇంకా
- నేను బుర్ఖా, గాజులు కొంటున్నానని ఒకరు,
- ప్రజలు కష్టపడి పనిచేసి పన్నులు చెల్లిస్తే, కేజ్రీవాల్ దుబారా చేస్తున్నాడని, ఇది ప్రజల డబ్బులతో ఓట్లు కొనుగోలు చేయడమేనని,
- అసలు ఉచిత ప్రయాణానికి, సురక్షితంగా ఉండటానికి సంబంధం ఏమిటని,
- సురక్షిత ప్రయాణం కోసం ఢిల్లీలో వీధిలైట్ల సంఖ్యను పెంచాలని, సీసీటీవీలను, సెక్యూరిటీని కూడా పెంచాలని, ఉచిత ప్రయాణం వల్ల లాభం ఏమిటని,
- లింగ సమానత్వం అంటే కేవలం మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణం కల్పించడం కాదని,
- టికెట్ రేట్లు అందరికీ 50% చేస్తే బావుంటుందని,
- ఇప్పటివరకు టోకెన్, స్వైపింగ్ మెషీన్లనే గేట్ల దగ్గర ఏర్పాటు చేశారని, ఇకమీదట లింగ భేదాన్ని గుర్తించే మెషీన్లను కూడా ఏర్పాటు చేయాలని,
- ఇప్పటివరకు అద్భుతంగా లాభాలలో పని చేస్తున్న ఢిల్లీ రవాణా వ్యవస్థలను నష్టాలకు గురిచేసే చర్య అని,
- ఆమ్ ఆద్మీ పార్టీ కాస్తా ఆమ్ ఔరత్ పార్టీగా మారిందని ఇలా లెక్కలేనన్ని విమర్శలు, ఛలోక్తులు కూడా వినిపిస్తున్నాయి.
Post a Comment