ఎన్నికల ఫలితాలు వచ్చి ఇరవై రోజులు గడిచిపోయినా, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గారు ఓటమి నుండి తేరుకోనట్లుగా ఉంది. ఆయనకు ఎప్పుడూ అనుకూలంగా వార్తలు వండే ఆంధ్రజ్యోతి పత్రిక కూడా దీనిని జీర్ణించుకోలేకపోతోంది.
ఆ పత్రిక వెలువరిస్తున్న కథనాల ప్రకారం, చంద్రబాబు గారిని ఓదార్చడానికి ప్రతిరోజు వివిధ జిల్లాల నుండి ఉండవల్లికి భారీగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలి వస్తున్నారట. వారితో ఆయన
రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసాం
ఎంతో కష్టపడ్డాం
ఒళ్లు దాచుకోకుండా మనం పని చేశాం.
కేంద్రం సహకరించకున్నా, ఇంత చేస్తే ప్రజలు అర్థం చేసుకోలేదు.
ఇలాంటి మాటలే రోజూ చెబుతూ, వచ్చిన వారందరి యోగక్షేమాలు కనుక్కుంటున్నారట.
అప్పుడు పార్టీ ఓడిపోయిందంటే నమ్మలేకపోతున్నాం అని ఆ వచ్చిన కార్యకర్తలు బాధపడుతున్నారట. ఒక్కొక్క రోజు ఏడ్చేశారని కూడా రాస్తున్నారు.
ఇలా తెలుగుదేశం పార్టీ వాణిని వినిపించే పత్రిక, ఆ పార్టీ అసంపూర్ణంగా వదిలేసిన రైతు ఋణమాఫీ హామీని వైసిపి పూర్తి చేయాలనే వాదనను కూడా ముందుకు తీసుకుపోదలచుకుంది. ఈ కథనాలలో భాగంగా ఇవాళ ఖమ్మం జిల్లా కార్యకర్తలు, రైతులు వచ్చి చంద్రబాబు గారితో రొటీన్గా సాగే ఈ ఓదార్పు కార్యక్రమం ముగిశాక, రైతు ఋణమాఫీ 4, 5 విడతల సొమ్ము నిలిపివేస్తారన్న ప్రచారంపై రైతులు ఆందోళన వ్యక్తం చేశారట. తెలంగాణలోని ఖమ్మం రైతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఋణమాఫీ పై ఆందోళన వ్యక్తం చేయడమేంటో?
ఇది ప్రచురించే సమయంలో సరిగ్గా గమనించనట్లుంది. తరువాత దానిని ఎడిట్ చేసి విశాఖపట్నం, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందినవారు కూడా కలిసారని చివరి రెండు లైన్లను అతికించారు. అదేదో మొత్తాన్ని సరిగ్గా ఎడిట్ చేస్తే పోయేదిగా. ఆ పేజీని ఇక్కడ చూడవచ్చు.
ఏదైనా పార్టీ, ఎన్నికలలో ఓడిపోతే కారణాలను విశ్లేషించుకుంటుంది. అభివృద్ధి చేసినా అర్థం చేసుకోలేదు. అంటూ రోజూ ప్రజలను ఆడిపోసుకునే ఓదార్పు యాత్రలు పెట్టుకోదు.
Post a Comment