కోమటిరెడ్డి సోదరులు వేరు, వేరు పార్టీలలో?

రాజగోపాల్ రెడ్డి గారి సంచలన వ్యాఖ్యలు 

మునుగోడు నుండి గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, తెలంగాణాలో టిఆర్ఎస్‌ను ఎదుర్కునే సత్తా బిజెపికి మాత్రమే ఉందని వ్యాఖ్యానించి సంచలనం రేపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వం నిద్రాణ స్థితిలో ఉందని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నాయకత్వ పటిమ లేదని అన్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు అనేది అవివేకమైన నిర్ణయమని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని కూడా వ్యాఖ్యానించారు. మీరు బిజెపిలో చేరనున్నారా?, అనే ప్రశ్నకు త్వరలోనే నానుండి మంచి నిర్ణయం వింటారు, అని బదులిచ్చారు. 

వ్యాఖ్యల వెనుక గతం 

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కొన్ని రోజుల క్రితం రాంమాధవ్ గారిని కలిసారని, బిజెపిలో చేరనున్నారని వార్తలు వినిపించాయి. అయితే వీటిని ఈయన సోదరుడైన వెంకటరెడ్డి గారు ఖండించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలతో, ఆ ఊహాగానాలకు బలం చేకూరింది. ఈయనకు మొదటి నుండి బిజెపి నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుత బిజెపి అధికార ప్రతినిధి అయిన కృష్ణసాగర్ రావు గారు, రాజగోపాల్ గారి సలహాదారుగా చాలాకాలం పాటు వ్యవహరించారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా, కోమటిరెడ్డి సోదరులు బిజెపిలో చేరతారని వార్తలు వచ్చినా అవి వాస్తవరూపం దాల్చలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని భావించి, వారు బిజెపి పట్ల ఆసక్తి చూపలేదు. పార్లమెంటు ఎన్నికలకు ముందు కూడా మళ్ళీ అవే వార్తలు వచ్చాయి. కానీ తెలంగాణాలో బిజెపికి అంత బలం లేదని ఆగిపోయారు. ఆ ఎన్నికల అనంతరం బిజెపి బలం పుంజుకున్నట్లు నిరూపణ అవడంతో, వారి పార్టీ మార్పు వార్తలు ఊపందుకున్నాయి.

మరిన్ని వాదనలు 

ఈ తరహా వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో సాధారణమని, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువని, వారికి ఉత్తమ్ కుమార్ రెడ్డిగారి పట్ల ఉన్న వ్యతిరేకతను ఈ విధంగా బయటపెట్టారని కూడా కొందరు విశ్లేషిస్తున్నారు.

వ్యాపారవేత్త అయిన రాజగోపాల్ రెడ్డి గారు, ఉత్తరాది మరియు ఈశాన్య రాష్ట్రాలలో భారీ కాంట్రాక్టులు పొందారని, బిజెపి అధికారంలో ఉన్న ఆ రాష్ట్రాలలో ఇబ్బందులు లేకుండా చూసుకునేందుకే బిజెపిలో చేరుతున్నారని కూడా వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.

వెంకటరెడ్డి గారి వివరణ 

సోదరుడి వ్యాఖ్యలపై వెంకటరెడ్డి గారు స్పందిస్తూ, వాటితో తనకు సంబంధం లేదని అన్నారు. తాను కాంగ్రెస్ లోనే కొసాగుతానని, పిసిసి అధ్యక్ష్య పదవిని ఇస్తే తీసుకుంటానని, పార్టీకి పునర్వైభవం తెచ్చే దిశగా కృషి చేస్తానని అన్నారు. ఒకే కుటుంబం వారు, ఎంతోమంది రెండు మూడు పార్టీలలో ఉన్నారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. వీటిని బట్టి ఇద్దరు సోదరులు రెండు వేరు, వేరు పార్టీలలో ఉండదలచుకున్నట్లు తెలుస్తుంది. 

0/Post a Comment/Comments

Previous Post Next Post