పోలవరం ప్రాజెక్టుకు జిఎస్‌టి మినహాయింపు లేదు.

పోలవరం ప్రాజెక్టుకు, 2017-18 ధరల ప్రకారం సవరించిన అంచనాలైన 55,548.87 కోట్లకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం లభించింది. సోమవారం రాజ్యసభలో కాంగ్రెస్‌ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, ఎంఏ ఖాన్‌, వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రతన్‌లాల్‌ కటారియా లిఖితపూర్వక సమాధానమిచ్చారు.    

పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటివరకు కేంద్రం కేవలం 6764.16 కోట్లు మాత్రమే విడుదల చేసిందని, వ్యయంపై ఆడిట్‌ నివేదిక పంపితే మిగతా నిధులు విడుదల చేస్తామని వివరణ ఇచ్చింది. కాగా, పోలవరం పనులకు సంబంధించి, జిఎస్‌టి మినహాయింపు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి విజ్ఞప్తి రాలేదని ఈ సమాధానంలో తెలిపింది.   

కొంత కాలం క్రితం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, పోలవరం అంచనాలను పెంచుతూ హడావుడిగా జీవో జారీ చేయడం వివాదాస్పదమైంది. జాతీయ ప్రాజెక్ట్ అంచనాలను కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఎలా పెంచుతారని, అవినీతికి పాల్పడేందుకే ఇలా చేశారని ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఆ ఆంచనాలకే కేంద్ర ప్రభుత్వ ఆమోదం లభించడం విశేషం. జాతీయ ప్రాజెక్టుల అంచనాల పెంపుకు, కేంద్ర ఆర్ధిక శాఖ ఆమోదం పొందిన అనంతరమే జీవో జారీచేయాలనే సంప్రదాయం ఉంది. ఆ సంప్రదాయం పాటించనందువల్లే, వారు ఆ ఆరోపణలను ఎదుర్కొనవలసి వచ్చింది.

ఇప్పుడు, వైసిపి ప్రభుత్వం వ్యయ అంచనాలను పంపడంలో ఇబ్బందిని ఎదుర్కోనుంది. అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న ప్రభుత్వం, ఖర్చు అంతా సవ్యంగానే జరిగిందని పంపితే తప్ప, కేంద్రం తరువాతి వాయిదా నిధులను విడుదల చేయదు. అవినీతి జరిగిందని చూపితే ఆ వ్యయాన్ని ప్రస్తుత ప్రభుత్వమే భరించవలసి ఉంటుంది. 

0/Post a Comment/Comments

Previous Post Next Post