హైదరాబాద్ మెట్రో విఫలమైందా?

గత కొన్ని రోజులుగా హైదరాబాద్ మెట్రోపై రెండు రకాల పరస్పర విరుద్ధమైన వార్తలు వస్తున్నాయి.
  • మెట్రోలో ప్రయాణికుల సంఖ్య ఒక రోజుకి, దాదాపు మూడు లక్షలకు చేరిందని, రద్ధీ సమయాల్లో కాలు మోపే స్థలం ఉండటంలేదని, కెటిఆర్ గారు ఈ రద్దీకి అనుగుణంగా రైళ్ల సంఖ్యను పెంచమని కోరినట్లు కొన్ని పత్రికలలో వార్తలు వచ్చాయి. 
  • మరికొన్ని పత్రికలు, 2019లో ప్రయాణికుల సంఖ్య రోజుకు 17 లక్షలుగా ఉంటుందని అంచనా వేయగా, ఇప్పుడు కేవలం మూడు లక్షల పరిధిలోనే ఉందని, నిర్మాణ సంస్థ భారీగా నష్టపోతుందని, మెట్రో విఫలం చెందిందని ప్రకటించాయి.  
స్థూలంగా చూస్తే వాటి, వాటి దృష్టికోణాల నుండి రెండురకాల వార్తలు సరియైనవే. కాని, మెట్రో సఫలమైందా?,  విఫలమైందా? అని నిర్ధారించడానికి లక్ష్యాలలో నిర్దేశించుకున్న ప్రయాణికుల సంఖ్య ఒక్కటే ఆధారం కాదు. ముందు వేసుకున్న అంచనాల ప్రకారం, 2014 కల్లా మెట్రో నిర్మాణం పూర్తయి, 3 లైన్లలో తుదికంటా పరుగులు పెట్టాలి. ఇప్పటికి అలా పూర్తవలేదు. ఆ సమయానికే అన్ని లైన్లు పూర్తయి ఉండి, అప్పటి చార్జీలే అమలయి ఉంటే ప్రయాణికుల సంఖ్య అంచనాలకు చేరుకునేది. కాని, ఇప్పటికీ  అన్ని లైన్లు అందుబాటులోకి రాలేదు.

నిర్మాణ సంస్థ నష్టపోతుందనే వాదన విషయానికి వస్తే ప్రతిపాదిత చార్జీల ప్రకారం గరిష్ట టికెట్ 19 రూపాయలు మాత్రమే ఉండాలి. ప్రస్తుతం గరిష్ట టికెట్ 60 రూపాయలుగా ఉంది. అంటే అంచనాలో మూడో వంతు ప్రయాణికులు ఉన్నా సరిపోతుంది. మూడు లైన్లు పూర్తిగా అందుబాటులోకి వస్తే అంచనాలో సగాన్ని తేలికగా అందుకునే అవకాశముంది. పైగా ఇది దీర్ఘకాలిక ప్రాజెక్టు. స్వల్పకాలంలో ఇలాంటి ఒడిదుడుకులను తట్టుకునే సత్తా ఎల్&టి లాంటి సంస్థకు ఉంది. అంతేకాక, ఆదాయంలో సగం మాత్రమే ప్రయాణికుల టికెట్ల నుండి సమకూరుతుంది. మిగతా సగం ఆ సంస్థకు నగరంలోని కీలక ప్రాంతాలలో ప్రభుత్వం ఇచ్చిన స్థలాలను వ్యాపారానికి ఉపయోగించుకోవడం ద్వారా సమకూర్చుకుంటుంది. కాబట్టి హైదరాబాద్ మెట్రో విఫలం చెందిందని భావించడం సరికాదు.     

 మెట్రో లైన్ల ప్రస్తుత స్థితి 
  • మియాపూర్- ఎల్బీనగర్ లైన్ పూర్తి అయింది. 
  • నాగోల్ -హైటెక్ సిటీ - గచ్చిబౌలి లైన్లో ఇంకా రివర్సల్ పూర్తి కాకపోటంతో, ఏడున్నర నిమిషాలకు ఒక రైలు మాత్రమే తిరగగలుగుతుంది. దాంతో ఈ మార్గం అమీర్ పేట్ వరకు రద్ధీగా కనిపిస్తుంది. మరో ఒకటి, రెండు నెలల్లో ఇక్కడ రివర్సల్ పూర్తయి మొత్తం లైన్ అందుబాటులోకి రానుండడంతో రైళ్ల ఫ్రీక్వెన్సీ పెరగనుంది. 
  • మూడవ లైన్ (జెబిఎస్ -ఫలక్ నుమా) ప్రజల కోసం ఇంకా తెరవబడలేదు. పాక్షికంగా (జెబిఎస్ - ఎంజిబిఎస్) మొదలుపెట్టడానికి మరో అయిదారు నెలల సమయం పట్టవచ్చు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post