మళ్ళీ తెరపైకి నియోజకవర్గాల పునర్విభజన

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో శాసనసభ నియోజకవర్గాల సంఖ్యను పెంచాలనే అంశం రాష్ట్ర విభజన చట్టంలో ఉంది. రెండు రాష్ట్రాలు నియోజక వర్గాల పునర్విభజన చేపట్టి, సంఖ్యను పెంచాలని  కేంద్ర హోంశాఖను అనేక మార్లు సంప్రదించినప్పటికీ పెద్దగా స్పందించలేదు. అలా చేయడంవలన బిజెపి పార్టీకి పెద్దగా ఉపయోగం ఉండదనే వారు మౌనం వహించినట్లు విమర్శలు కూడా ఉన్నాయి. 

కేంద్రం కనబరుస్తున్న నిరాసక్తత, 2026లో దేశవ్యాప్తంగా ఎలాగూ జరగనున్న నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ దృష్ట్యా రెండు తెలుగు రాష్ట్రాలు ఈ విభజన చట్టం హామీపై ఆశలు వదిలేసుకున్నాయి. అయితే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతో నియాజకవర్గ సంఖ్య పెంపు అంశంపై మళ్ళీ ఆశ‌లు చిగురించాయి. 

కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ నియాజక వర్గాల సంఖ్యను పునర్వ్యవస్థీకరించాలని భావిస్తోంది. అక్కడ ఎక్కువ సంఖ్యలో ముస్లింలు  ఉన్న కాశ్మీర్ లోయలోని ప్రాంతీయ పార్టీల ప్రాబల్యాన్ని అడ్డుకునే దిశగా చర్యలు చేపట్టనుంది. హిందువులు ఎక్కువగా ఉన్న జమ్మూ ప్రాంతంలో నియోజక వర్గాలను పెంచి, కాశ్మీర్ ప్రాంతంలో నియోజక వర్గాలను తగ్గించాలని ఆ పార్టీ వ్యూహంగా ఉంది. ఇందుకు గాను హోంశాఖ పునర్విభజన కమిషన్‌ను ఏర్పాటు చేయనుంది. ఒకే రాష్ట్రంకోసం వేస్తే అనవసర విమర్శలు వచ్చే అవకాశం ఉండడంతో మరికొన్ని రాష్ట్రాలను కూడా ఈ పునర్విభజనలో చేర్చనున్నారు. వాటిలో ఇప్పటికే ఈ డిమాండ్ చేస్తున్న రెండు తెలుగు రాష్ట్రాలు కూడా  ఉండే అవకాశముంది.          

0/Post a Comment/Comments

Previous Post Next Post