ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం రోజు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టిన పార్టీలకు కృతజ్ఞతలు తెలియచేసారు. పార్లమెంట్లో తమకు లభించిన మద్ధతు ప్రతిపక్షాల వాదనల్లో డొల్ల తనాన్ని బయట పెట్టిందని, ప్రభుత్వ విధానాలను ప్రజలకు వివరించే అవకాశం కలిగిందని అన్నారు.
వర్షాకాల సమావేశాల సందర్భంగా ఏర్పాటు చేసిన బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ప్రతిపక్షాల ఎత్తుగడలో రాజకీయ అపరిపక్వత కనిపిస్తోందని, వారికి సబ్జెక్ట్ పైన అవగాహన లేదని అన్నారు. అవిశ్వాస తీర్మానం భారీ తేడాతో వీగిపోయినందుకు ఎంపీలు, మంత్రులు ప్రధానిని అభినందించారు.
బీజేపీ అధ్యక్ష్యుడు అమిత్ షా మాట్లాడుతూ ప్రతిపక్షాలను తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రభుత్వం మెజారిటీ కోల్పోయినప్పుడు లేక దేశంలో అశాంతి నెలకొన్నప్పుడే అవిశ్వాసం తీసుకువస్తారని, సుస్థిరమైన భారీ మెజారిటీ ఉన్న ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టడం వారి అసహనాన్ని సూచిస్తుందని మండిపడ్డారు. ఓటింగ్ లో కూడా ఈ విషయం స్పష్టమైందని తమకు 325 ఓట్లు రాగా, ప్రతిపక్షాలకు కేవలం 126 ఓట్లే వచ్చాయని షా అన్నారు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మోడీని కౌగలించుకోవటం రిహార్సల్ వేసిన నాటకంలో భాగమని, తన సీటుకు తిరిగి వెళ్లిన వెంటనే కన్ను గీటడం దానిని సూచిస్తుందని షా వ్యాఖ్యానించారు.
Post a Comment