శ్రీలంక ఇప్పటికే అసలు నౌకలు రాని ఓడరేవును చైనాకు అమ్మివేసింది. అదే పద్దతిలో అసలు విమానాలే రాని విమానాశ్రయాన్ని మనదేశానికి అమ్మివేయడానికి ప్రయత్నిస్తోంది.
శ్రీలంక హంబంటోట లోని మత్తాల రాజపక్సే అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చైనాకు అమ్మివేసే ప్రయత్నం చేసింది. కానీ చైనా ప్రభుత్వం దానికి పెద్దగా స్పందించలేదు. అయితే ఇప్పుడు భారతదేశంతో చర్చలు జరుగుతున్నాయని ప్రధానమంత్రి రణిల్ విక్రమ సింఘే అన్నారు. ఈ రెండు ప్రాజెక్టులను శ్రీలంకలోని గత ప్రభుత్వం చైనా నుండి తీసుకున్న ఋణాల ద్వారా నిర్మించి అప్పుల ఊబిలో కూరుకుపోయిన విషయం తెలిసిందే.
2011 నుండి 300 మిలియన్ డాలర్ల నిర్వహణ నష్టం కలిగి ఉన్న హంబంటోట ఓడరేవును చైనాకు చెందిన మర్చంట్స్ గ్రూపుకు 1.1 బిలియన్ డాలర్లకు శ్రీలంక ప్రభుత్వం అమ్మివేసి నష్టాల నుండి, అప్పుల నుండి బయట పడింది. ఇలా అమ్మగలగడాన్ని తమ ప్రభుత్వ విజయంగా శ్రీలంక ప్రధాని చెప్పుకున్నారు. విమానాశ్రయం విషయంలోనూ ఇదే పంథాను కొనసాగించాలని భావిస్తుంది. ఒకసారి విమానాశ్రయం అప్పుల నుండి బయట పడితే లాభాలు రాగలవని ఆ దేశం ఆశిస్తోంది.
మన దేశం ప్రాథమికంగా ఆసక్తిని చూపినా నష్టాలను భరించవలసి వస్తుందేమోనని భయపడుతోంది. పక్కనే చైనా అధీనంలో ఉన్న ఓడరేవు పై ఓ కన్నేసి ఉంచడానికి ఈ ఆసక్తిని చూపినట్టు తెలుస్తుంది. మన దేశ సైనిక అవసరాలకు ఉపయోగపడితే కొనే ఉద్దేశ్యంలో ఉంది కానీ తమ గడ్డ మీద మళ్ళీ విదేశీ సైన్యాన్ని గానీ, యుద్ధ విమానాలను గానీ శ్రీలంక అనుమతించడం కష్టమే.
Post a Comment