దేశాన్ని ఒకే పన్ను స్లాబ్ కిందకు తీసుకు రావటం కష్టమని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షం మరియు కొందరు ఆర్ధిక వేత్తలు డిమాండ్ చేస్తున్నట్లుగా అన్ని వస్తువులపై 18% పన్ను విధిస్తే నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతాయని ఆయన అన్నారు. పాలకు, మెర్సిడెజ్ బెంజ్ కారుకు ఒకే పన్ను వేయలేమన్నారు.
జీఎస్టీతో పారదర్శకత పెరిగిందని, పన్ను వసూళ్ళలో అభివృద్ధి కనిపిస్తుందని , ఈ పన్ను అమల్లోకి వచ్చి ఆదివారం నాటికి ఏడాది పూర్తయిన సందర్భంగా ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. దేశమంతా ఒకే పన్ను వల్ల రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్టుల అవసరం లేకుండా పోయింది. పన్ను చెల్లింపులు సులభతరమయ్యాయి అని కూడా వివరించారు.
జీఎస్టీ అమలులో ఏర్పడుతున్న ఇబ్బందుల గురించి ప్రస్తావిస్తూ, మనది విశాలమైన మరియు సంక్లిష్టమైన దేశమని, ఏదైనా వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరిపినప్పుడు కొన్ని ఇబ్బందులు తప్పవని ప్రధాని అన్నారు. అయితే తాము దీనిని సాధ్యమైనంత సరళంగా, సున్నితంగా పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. చాల వరకు ఆహార పదార్థాలు, నిత్యావసరాలు 0% మరియు 5% పన్ను పరిధిలోనే ఉన్నాయని, పేదలకు, మధ్య తరగతి వర్గాలకు మేలు చేసేందుకే ఈ తరహా పన్ను విధానం అమలవుతుందన్నారు.
Post a Comment