కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన నీళ్లు, రైల్వేలైన్, ముడి ఖనిజం అన్నీ ఉన్నా కేంద్రం మీన మేషాలు లెక్కబెడుతోందని ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు గారు విమర్శించారు. విభజన హామీలు సాధించుకోవడానికి తాము కేంద్రంపై రాజీలేని పోరాటం చేస్తున్నామని ఆయన అన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ గ్రౌండులో నిర్వహించిన హోంగార్డుల ఆత్మీయ అభినందన సభలో ఆయన ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఆంధ్ర ప్రజలు కేంద్రానికి బానిసలు కాదని, విభజన హామీలు సాధించేదాకా కేంద్రాన్ని వదిలిపెట్టే సమస్యే లేదని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. ఒకవైపు పోరాటం చేస్తూనే, మరోవైపు అభివృద్ధి కోసం కష్టపడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నిధులు లేకపోయినా తమ ప్రభుత్వం ప్రజలకోసం సంక్షేమ కార్యక్రమాలను చేపడుతోందన్నారు.
విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని కేంద్రమే ఆదుకోవాలని ఆయన అభ్యర్థించారు. ఉక్కు పరిశ్రమ కోసం అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని తాము చెబుతున్నా కేంద్రం చిన్న చూపు చూస్తోందని, ఆంధ్రప్రదేశ్ కడుతున్న పన్నులు మాకు ఇస్తే మేమే ఉక్కు పరిశ్రమ పెట్టుకుంటామని ఆయన అన్నారు.
Post a Comment