మంత్రి గంటా శ్రీనివాస రావు పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. తన నియోజకవర్గం భీమిలిలో చేసినట్లుగా తెలుగు దేశం అనుకూల పత్రిక లో వచ్చిన సర్వే తనను అప్రతిష్టపాలు చేసేలా, తన నియోజకవర్గంలోనే తనకు వ్యతిరేకత పెంచేలా ఉందని ఆయన మనస్తాపానికి గురయ్యారు. ఇది తనపై కొందరు కావాలని చేసిన కుట్ర గా భావిస్తున్న మంత్రి వెలగపూడి సచివాలయంలో మంగళవారం జరిగిన క్యాబినెట్ మీటింగ్ కు కూడా రాలేదు. ఆ సమయంలో ఆయన విశాఖపట్నంలోనే ఉండిపోయారు. ఈ విషయం తెలుసుకున్న కొందరు ఆయనను ఫోన్ ద్వారా సంప్రదించే ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయన అందుబాటులోకి రాలేదని సమాచారం.
గత రెండేళ్లుగా తనకు వ్యతిరేకంగా పార్టీలో కొంతమంది పని చేస్తున్నారనీ, వాటిని ఎప్పటికప్పుడు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని మంత్రి గంటా బాధపడుతున్నారని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టి బ్యాంకు రుణం తీసుకున్నట్లు, విశాఖపట్నంలో భూ కుంభకోణానికి పాల్పడినట్లు తనపై ఆరోపణలు రావటం వెనక, హైకోర్టులో పిల్ దాఖలు చేయటంలోనూ పార్టీలోని కొందరి పాత్ర ఉన్నట్లు ఆయన భావిస్తున్నారు.
Post a Comment