సోమవారం చెన్నై నగరంలో వివిధ కళాశాలలు పునః ప్రారంభం అయిన రోజునే విద్యార్థులు రచ్చ రచ్చ చేసారు. బస్సులు మరియు ఇతర బహిరంగ ప్రదేశాల్లో అలజడి సృష్టించినందుకు సుమారు 110 మంది కళాశాల విద్యార్థులను పోలీసులు కొంత సమయం పాటు నిర్బంధించారు. ఆరుగురు విద్యార్థుల దగ్గర కత్తులు, ఇతర మారణాయుధాలు కూడా లభించాయి.
విద్యార్థుల ప్రవర్తనను పర్యవేక్షించ వలసిందిగా అన్ని కళాశాలలకు ఇప్పటికే మేము సర్క్యులర్లను జారీ చేసాము. అయినా సోమవారం రోజు మేము అన్ని ముఖ్య కాలేజీ జంక్షన్లలో పోలీసు సిబ్బందిని ఉంచి తనిఖీలు చేయవలసి వచ్చిందని పోలీసు అధికారులు తెలిపారు. విద్యార్థులు బస్సుల పైకి ఎక్కడం, బిగ్గరగా పాడటం, రహదారిపై ఇతర వాహనదారులను భయపెట్టడం వంటివి చేయటంతో అదుపులోకి తీసుకోవలసి వచ్చిందని వివరించారు.
కళాశాల నిర్వాహకులు వీటిని సాధారణ విషయాలుగా పేర్కొన్నారు. ఇది తొలిసారి జరిగింది కాదని, ఏటా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొనడం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది.
నిర్బంధించిన విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి వారి నుంచి రాత పూర్వకంగా లేఖలు తీసుకుని వదిలిపెట్టారు. కత్తులతో దొరికిన ఆరుగురు విద్యార్థులను మాత్రం అరెస్ట్ చేసి జ్యూడిషియల్ రిమాండ్ కు తరలించారు.
Post a Comment