న్యూ ఢిల్లీ లో ఈ రోజు జరుగనున్న నీతి ఆయోగ్ సమావేశం లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విభజన తర్వాత రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను మరియు ప్రత్యేక హోదా అంశాన్ని బలంగా ప్రస్తావించే అవకాశాలున్నాయి. గత కొన్ని రోజులుగా ముఖ్య మంత్రి రాష్ట్ర మంత్రులతోనూ, అధికారులతోనూ మరియు ఎంపీలతోనూ జరిపిన చర్చల్లో ఈ సమావేశంలో లేవనెత్తాల్సిన విషయాలపై కసరత్తు జరిపారు.
ఎన్డీయే నుండి వైదొలిగిన తర్వాత చంద్రబాబు నాయుడు, ప్రధాన మంత్రి ని కలవటం ఇదే తొలిసారి కావటంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుండటంతో అందివచ్చిన ఈ అవకాశాన్ని వదులుకుంటాడని భావించలేం.
నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రత్యేక హోదా తో సహా రాష్ట్రానికి ఇచ్చిన అన్ని హామీలపై మొండి చెయ్యి చూపిందని ముఖ్యమంత్రి గారు ధ్వజమెత్తారు. కేంద్రం సహాయ నిరాకరణ చేసినా తన సమర్థతతో రాష్ట్రం 10.5% వృద్ధిరేటును సాధించిందని తెలిపారు. జిఎస్టీ ఇంకా నోట్ల రద్దు తో ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసారని ఆరోపించారు. ప్రజలకు ఇంకా పూర్తి స్థాయిలో నిధులు అందుబాటులోకి రాలేదనీ, ATM ల ముందు కనిపిస్తున్న భారీ క్యూలే దీనికి నిదర్శనమనీ అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఇంతలా పెరగటానికి కూడా మోడీ ఆర్ధిక విధానాలే కారణమనీ, ఫెడరల్ వ్యవస్థ కు ఈ విధానాలు గొడ్డలిపెట్టని కూడా అన్నారు.
Post a Comment