ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ రోజుకి అత్యవసర పరిస్థితి విధించి 43 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. గాంధీ కుటుంబం, స్వార్థపూరిత మరియు వ్యక్తిగత లాభాపేక్షలతో దేశాన్ని జైలుగా మార్చిందన్నారు. ఈ సందర్భంగా ముంబయి లో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగిస్తూ, ఈ రోజున అందరూ పునరంకితమై రాజ్యాంగం మరియు ప్రజాస్వామ్య పరిరక్షణకు నడుం కట్టాలని ఉద్బోధించారు.
అత్యవసర పరిస్థితి అనేది మనదేశ సువర్ణాధ్యాయం పై నల్లని మచ్చ అని ప్రధాని అన్నారు. ఈ రోజును జరుపుకోవడం అంటే కాంగ్రెస్ పార్టీ ని విమర్శించడమే కాకుండా ప్రజాస్వామ్య రక్షణ పట్ల అవగాహన కల్పించడానికి కూడా అని ఆయన అన్నారు. బిజెపి పాలనలో దేశంలో రాజ్యాంగం, దళితులు, మైనారిటీలు ప్రమాదంలో ఉన్నారని భ్రమలు కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ బాగుపడబోదని, సొంత లాభం కోసం వారు తమ స్వంత పార్టీని ధ్వంసం చేసారని అన్నారు.
కాంగ్రెస్ వారు, తమ స్వార్ధ ప్రయోజనాలకోసం ప్రతిపక్ష నాయకులను నిర్బంధించడం ద్వారా దేశాన్ని జైలుగా మార్చారు. వారికి, దేశం మరియు ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేదు. కోర్టు తీర్పు తరువాత ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ పదవీవిరమణ చేయడానికి బదులుగా, అత్యవసర పరిస్థితిని విధించారు. మళ్ళీ వీరే ఇప్పుడు ప్రజలతో రాజ్యాంగ పరిరక్షణ గురించి ఎలా మాట్లాడతారు? అని ఆయన ప్రశ్నించారు. కిషోర్ కుమార్ గారు కాంగ్రెస్ వారి కోసం పాడటానికి నిరాకరిస్తే, అతని పాటలు రేడియోలో రాకుండా నిషేధించారు. అని కూడా వ్యాఖ్యానించారు.
Post a Comment