గట్టు ఎత్తిపోతల పథకం పనులను ప్రారంభించడానికి గద్వాలకు వచ్చిన కేసీఆర్, ఇక్కడి ప్రజలకు అడిగిందే తడవుగా వరాల వర్షం కురిపించారు. ఆయన ప్రకటనలతో ప్రజలు పెద్దపెట్టున హర్షధ్వానాలు చేసారు.
ఈ సభకు మంత్రులు హరీశ్ రావు, లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. కేసీఆర్ ఈ సందర్భంగా ఎందరో ప్రాణత్యాగాలు చేస్తే మనకు తెలంగాణ కల సాకారం అయిందనీ, ఖచ్చితంగా తెలంగాణలో కోటి ఎకరాలకు నీరు అందేవరకు ఈ యజ్ఞం కొనసాగుతుందని అన్నారు. తెలంగాణలో కరంటు సమస్య అనేది లేదని, రైతు బంధు పథకం వల్ల రైతులకు మేలు జరిగిందని అని ఆయన తెలిపారు.
కేసీఆర్ కురిపించిన వరాలు
- గద్వాల ఆసుపత్రిని 300 పడకల ఆస్పత్రిగా మారుస్తూ తక్షణమే ఆదేశాలు
- ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాల కోసం 100 కోట్ల రూపాయలు
- గద్వాల జిల్లాలో ఎస్సీ స్టడీ సర్కిల్ ఏర్పాటుకు అంగీకారం
- గద్వాల బస్టాండ్ ఆధునికీకరణకు 2 కోట్ల రూపాయలు
- జూరాల డ్యాం వద్ద బృందావనం ఏర్పాటుకు 15 కోట్ల రూపాయలు
- గట్టు ఎత్తిపోతల పథకానికి ప్రజల కోరిక ప్రకారం నల్ల సోమనాద్రి గట్టు ఎత్తిపోతల పథకం అని పేరు
- కేటీ దొడ్డి మండల కేంద్రంలో గిరిజన గురుకుల పాఠశాల
- రాష్ట్రంలో కొత్తగా 119 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయనున్నట్లు, వాటిలో ఒకటి గద్వాలలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
రాస్తే రామాయణ మంత.. చెప్తే భారత మంత
గుఱ్ఱంగడ్డ వంతెన గురించి రాస్తే రామాయణ మంత.. చెప్తే భారత మంత అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఎప్పటినుంచో ఆ వంతెన నిర్మాణం పెండింగ్లో ఉందని, ఆ వంతెనకు 8 కోట్లు కాదు.. 10 కోట్లు అయినా సరే రేపు సాయంత్రం లోపే నిర్మాణానికి సంబంధించిన జీవో విడుదల చేస్తామని ప్రకటించారు.
Post a Comment