నూతన అసెంబ్లీ, సచివాలయం ఎందుకు?

తెలంగాణలో నాలుగు వందల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నూతన సచివాలయం, వంద కోట్ల రూపాయల వ్యయంతో నూతన సభా భవనాలను నిర్మించనున్నారు. వీటిలో సచివాలయాన్ని ప్రస్తుతం ఉన్న ప్రాంతంలోనే నిర్మిస్తుండగా, అసెంబ్లీని ఎర్రమంజిల్‌లో నిర్మించనున్నారు. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని కెసిఆర్ గారు విలేఖరులకు వెల్లడించారు.  

పాత సచివాలయంలోని అన్ని భవనాలను కూల్చి కొత్తగా నిర్మించాలా?  లేక పాతవాటిని వాడుకుంటూ నిర్మాణం జరపాలా? అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన అన్నారు. సభా భవనాలను పార్లమెంట్ తరహాలో మూడు హాల్‌లు వచ్చే విధంగా నిర్మించనున్నారు. ఈ నెల 27న సచివాలయ భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు.     

కెసిఆర్ గారు ఈ వివరాలు వెల్లడించిన వెంటనే , కొత్త సచివాలయం నిర్మాణానికి వాస్తు దోషమే కారణమని ప్రతిపక్ష నేతలైన రేవంత్ రెడ్డి, లక్ష్మణ్‌లు విమర్శించారు. చాలాకాలంగా ఈ తరహా వార్తలు ప్రజలలో వినబడుతున్నాయి. కెసిఆర్ గారికి ఉన్న నమ్మకాలు మరియు విశ్వాసాల దృష్ట్యా ఇవి నిజమని నమ్మేవారి సంఖ్య కూడా ఎక్కువే. వాస్తు వంటి వ్యక్తిగత విశ్వాసాల కోసం పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, దీనిని అడ్డుకోవాలని సోషల్ మీడియాలో కూడా ప్రచారం సాగుతోంది.  

వాస్తు దోషాల వల్ల కొత్త సచివాలయాన్ని నిర్మిస్తున్నారా? లేక  రాష్ట్రానికి మరిన్ని సదుపాయాలు కలిగిన ఆధునిక సచివాలయం అవసరమై  నిర్మిస్తున్నారా? అనే విషయంపై వివరణ, ఇప్పటివరకు కెసిఆర్ నుండి గాని, ప్రభుత్వం నుండి గాని వెలువడలేదు. అంతగా ప్రాముఖ్యత లేని విషయాలపై వదంతులను విస్మరించవచ్చు. కాని, ఇంత భారీగా ప్రచారంలోకి వచ్చిన వార్తపై వివరణ ఇవ్వకపోతే, వాస్తుకోసమే కొత్త సచివాలయాన్ని నిర్మిస్తున్నాడని భావించేవాళ్లు తమ నమ్మకాన్ని దృఢపరుచుకుంటారు. ఆధునిక సచివాలయం కోసమే అని భావించే వాళ్ళు ఆయనది అహంకారమనుకుంటారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post