శ్రీవారిని కాలినడక న దర్శించుకోవడానికి బుధవారం తిరుపతి వచ్చిన మోత్కుపల్లి నర్సింహులు చంద్రబాబు నాయుడు గారిపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు అంటేనే మోసాలు, కుట్రలు , వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అని అన్నారు. పేద దళితుడినైన తాను, అంబేడ్కర్ వారసుడినని, ఎన్టీఆర్ శిష్యుడినని చెప్పుకున్నారు. చంద్రబాబు లాంటి నీచుడిని నమ్మొద్దని ఎన్టీఆర్ ఆనాడే హెచ్చరించారని అయినా వినకుండా నమ్మి నిండా మోసపోయానన్నారు.
చంద్రబాబు ఎన్టీఆర్ను మానసికంగా హత్య చేశాడని, అదే తరహాలో కేసీఆర్ను కూడా రాజకీయంగా హత్యచేయాలని ప్లాన్ చేసాడని ఆరోపించారు. ఎన్టీఆర్కు 30 మంది రాజకీయ వారసులు ఉండగా అందరినీ రాజకీయంగా చంపేసాడని అన్నారు.
టిడిపి లో ఉన్న దళితులందరినీ దగా చేసారని, ఆ పార్టీ లో ఒక్క దళితుడు కూడా బాగు పడలేదని మండిపడ్డారు. ఒక్కొక్క రాజ్యసభ సభ్యత్వాన్ని 100 కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు. సుజనాచౌదరి, సీఎం రమేష్, టీజీ వెంటేష్లకు డబ్బులు తప్ప ఏ అర్హత ఉందని ఎంపీ పదవులు ఇచ్చారు? కేంద్ర మంత్రి పదవులకు, రాజ్యసభ సభ్యులుగా దళితులు పనికిరారా? అని ప్రశ్నించారు.
చంద్రబాబు అధర్మాలపై ధర్మపోరాటం పేరుతో ఆయన కాలినడకన తిరుమల బయలు దేరారు. ఆయన తిరుపతి వచ్చిన సందర్భంగా దళిత సంఘాలతో పాటు, వైయస్సార్ కాంగ్రెస్, జనసేన పార్టీలు కూడా స్వాగతం పలికాయి. ఇవాళ్టి రాజకీయాలలో లబ్ది ఉంటుందనుకుంటే తమకు సంబంధం లేని వారికి కూడా పార్టీలు స్వాగతం పలుకుతున్నాయి.
Post a Comment