చంద్రబాబు దేవాలయాలను కూడా వదిలి పెట్టడం లేదు

చంద్రబాబు దేవాలయాలను కూడా వదిలి పెట్టడం లేదు
చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ప్రతిపక్ష నేత జగన్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం లో పర్యటిస్తున్న జగన్, అధికారం లోకి వచ్చిన తరువాత చంద్రబాబు ఇచ్చిన హామీలను మర్చిపోయారని, వాటిపై ప్రశ్నించకుండా ఇప్పుడు ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. 

తెలుగుదేశం హయాంలో అవినీతి గురించి ప్రజలు కథలు, కథలుగా చెప్పుకొస్తున్నారనీ, ఇసుక, మట్టి మొదలుకుని దేవాలయాల్లో పారిశుద్ధ్య పనులను కూడా వదలటం లేదని జగన్ అన్నారు.  అన్నవరం దేవాలయంలో పారిశుద్ధ్య నిర్వహణ ఖర్చును 7 లక్షల నుంచి 32 లక్షలకు పెంచి, చంద్రబాబు బంధువైన భాస్కర నాయుడు అనే వ్యక్తికి కట్టబెట్టారని, దేవుని దగ్గర కూడా  డబ్బులు కొట్టేయాలని  చూస్తున్నారని, పాపభీతి అనేది కూడా లేకుండా పోయిందని మండిపడ్డారు. 

జిల్లాలో లాటరైట్ పేరిట అదనంగా అటవీ భూములను ఆక్రమించుకుని బాక్సైట్ మైనింగ్ చేస్తున్నారని జగన్ అన్నారు. ఇక్కడ మరుగు దొడ్ల నిర్మాణంలో కూడా కోటి రూపాయల స్కాం జరిగిందని ఆరోపించారు. నారాయణ, చైతన్యల కోసం గవర్నమెంట్  విద్యా వ్యవస్థను నాశనం చేసారని, ప్రభుత్వ పాఠశాలలను మూసి వేస్తున్నారని దుయ్యబట్టారు. తాను అధికారంలోకి వస్తే జిల్లాలో నీటి పారుదల వ్యవస్థను బాగు చేస్తానని, కౌలు రైతులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post