పార్లమెంటరీ స్థాయీ సంఘం ముందు ఆంధ్ర ప్రదేశ్ వితండ వాదన

పార్లమెంటరీ స్థాయీ సంఘం ముందు ఆంధ్ర ప్రదేశ్ వితండ వాదన
14వ ఆర్థికసంఘం లోటు బడ్జెట్ ఉన్న అన్ని రాష్ట్రాలకు, భవిష్యత్తులో అవి లోటు నుండి బయటపడి ఆర్థిక క్రమ శిక్షణ పాటించేలా అయిదు సంవత్సరాల పాటు వాటి ఆర్థిక లోటు భర్తీకి అదనపు నిధులు అందచేసింది. దానిలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ కు కూడా 22వేల కోట్లు కేటాయించారు.

కేవలం లోటు ఉన్న రాష్ట్రాలకు అదనపు నిధులపై, ఆర్ధిక క్రమశిక్షణ పాటించిన రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేసాయి.  ఆర్థిక నిబద్దత పాటించిన వారికి శిక్ష విధిస్తారా అని కేంద్రాన్ని, అవి ప్రశ్నించగా, ఇలాంటి ప్రోత్సాహకం అందించటం ఇదే చివరిసారి అని, భవిష్యత్తులో ఇలాంటివి ఉండబోవని, ఆర్థిక క్రమశిక్షణ పాటించని వాటిపై చర్యలు తీసుకుంటామని కూడా  కేంద్రం తెలిపింది. 

కాగా పార్లమెంటరీ స్థాయీ సంఘం ముందు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తమ ఐదు సంవత్సరాల లోటు అంచనా వేసినట్లు 22వేల కోట్లు కాదనీ, 1.45 లక్షల కోట్లనీ వాదించటం విస్మయం కలిగిస్తుంది. ఈ అంచనాలను ఆర్థిక సంఘం విభజన తర్వాతే రూపొందించింది. ప్రోత్సాహకంతో లోటును తగ్గించుకుంటామని చెప్పవలసిన చోట, మరింత రావాలనే వాదనలు చేయటం ఏమిటో?, ఆంధ్ర ప్రదేశ్ విభజన సమస్యలను అధిగమించటానికి నిధులు అడగటంలో న్యాయం ఉంటుంది. కానీ ఇక్కడ అడగటం వితండవాదం అవుతుంది. 

తెలంగాణతో సహా కొన్ని రాష్ట్రాలకు ఒక్క రూపాయి కూడా ఇలా లోటు కోసం కేటాయించలేదు. అప్పుడు అవి నానా యాగీ చేస్తే ఒకసారి రూపొందించిన తర్వాత కేటాయింపుల మార్పు సాధ్యం కాదని అప్పుడే కేంద్రం తేల్చి చెప్పింది. 14వ ఆర్థిక సంఘం వల్ల దేశంలో కేవలం రెండు రాష్ట్రాలకు మాత్రమే నిధులు తగ్గాయి. వాటిలో తెలంగాణ ఒకటి. 

14వ ఆర్థిక సంఘం ప్రకారం దక్షిణ భారత దేశంలో అత్యధిక (నిధులు /పన్ను వసూళ్లు) కేటాయింపులు ఉన్న రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్. ఇది ఈ రాష్ట్రానికి 85 శాతం వరకు ఉండగా, మరే దక్షిణాది రాష్ట్రానికి 60% మించలేదు. ఇక్కడ ఏం మాట్లాడినా, ప్రచారం చేసుకోవటానికి తప్ప, అదనపు నిధులు వచ్చే అవకాశం లేదు, హోదాపై దృష్టి పెట్టడమే మేలు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post