రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఒకప్పుడు తాను అన్న మాటలను అవసరార్థం మర్చిపోయారు. మన దేశంలో రాష్ట్రపతి పదవి కూడా రాజకీయ అవసరాలకు అతీతం కాదని మరోసారి విజయవంతంగా నిరూపించేసారు.
భారత రాజ్యాంగంలోని 80(1)(a) వ అధికరణం ప్రకారం రాష్ట్రపతి తన పదవీకాలంలో సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, కళలు, సామాజిక సేవా రంగాలకు చెందిన 12 మంది ప్రముఖులను నేరుగా రాజ్యసభకు నామినేట్ చేయవచ్చు. అలాంటి నామినేషన్ సీట్లు ఇప్పుడు నాలుగు ఖాళీ కావటంతో నలుగురిని నామినేట్ చేసారు. వారు వరుసగా రామ్ షాకల్, రాకేష్ సిన్హా, రఘునాథ్ మహాపాత్ర, సోనాల్ మాన్సింగ్లు. వీరిలో రామ్ షాకల్ కు రాజకీయ నేపథ్యం, రాకేష్ సిన్హాకు RSS నేపథ్యం ఉన్నాయి.
సంప్రదాయం ప్రకారం ఈ పదవులకు రాజకీయ నేపథ్యం ఉన్నవారిని నామినేట్ చేయకూడదు. రాష్ట్రపతి ఇలా ఈ నిబంధనను ఉల్లంఘించటం ఇదేమీ తొలిసారి కాదు. 2016 లో కూడా సిద్ధూ, సుబ్రహ్మణ్య స్వామిలు ఇలాగే నియమితులయ్యారు.
కాగా 2009లో బీజేపీ అధికార ప్రతినిధిగా ఇదే రామ్నాథ్ కోవింద్ ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం రాజ్యసభకు మణిశంకర్ అయ్యర్ ను నామినేట్ చేసింది. ఆయన సాహితీ వేత్త అయినప్పటికీ, కాంగ్రెస్ నాయకుడు కావటంతో కోవింద్ అప్పుడు ఆ నామినేషన్ ను తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు ఆయనే అంతకు మించిన సాంప్రదాయ ఉల్లంఘనలు చేస్తున్నారు. అదే రాజకీయమంటే, ప్రతిపక్షంలో ఉంటేనే ఎక్కడలేని విలువలు గుర్తొస్తాయి.
Post a Comment