సింగపూర్ లో జరుగుతున్న వరల్డ్ సిటీస్ సమ్మిట్ మేయర్స్ ఫోరమ్ (WCSMF) లో పాల్గొంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అక్కడ పెట్టుబడిదారులను ఆకర్షించే ప్రయత్నం చేసారు. మూడు రోజుల సింగపూర్ పర్యటనలో భాగంగా అక్కడి దేశ అభివృద్ధి శాఖా మంత్రి లారెన్స్ వాంగ్తో సమావేశమయ్యారు.
సింగపూర్ వారి భాగస్వాములను జాగ్రత్తగా ఎన్నుకుంటుంది. భారతదేశంలో మాకు ఉన్న ఏకైక భాగస్వామ్యం ఆంధ్రప్రదేశ్ తో ఉంది అని లారెన్స్ వాంగ్ అన్నారు. రాబోయే కాలంలో గ్రీన్ ఫీల్డ్ నగరం అమరావతి ప్రణాళికా బద్ధమైన వృద్ధి కోసం బంగారు అవకాశాన్ని కల్పిస్తుందని ఆయన చెప్పారు. రాజధాని నిర్మాణం సమాజంలోని అన్ని తరగతులను ఏకం చేసిందని, ఇది ప్రజల రాజధాని అని, విభజన నష్టాలు ఇప్పటికే అధిగమించామని చంద్రబాబు ఈ సందర్భంగా అన్నారు.
రాజధానికి నిధులు సమకూర్చమని చంద్రబాబు చేసిన అభ్యర్థనకు స్పందించిన ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్టుమెంట్ బ్యాంకు (AIIB) ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ పాంగ్ యీ ఈన్ ఆయనకు సానుకూలంగా స్పందించి, వారికి అవసరమైన వివరాలను పంపించ వలసిందిగా కోరారు. రహదారులు, నీటి సరఫరా, నీటిపారుదల, విద్యుత్తు రంగాలలో మరింత అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేయాలనుకుంటున్నట్లు ఆయన అన్నారు. లోథా గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ అభిషేక్ మంగళ్ ప్రభాత్ లోధా మాట్లాడుతూ, తన గ్రూపు మాల్స్, వినోద రంగాలలో పెట్టుబడులు పెట్టాలని ఆసక్తి గా ఉందన్నారు.
Post a Comment