119 బీసీ బడులు

119 బీసీ బడులు
బీసీ, ఎంబీసీల స్వయం ఉపాధి పథకాలకు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరంనాటికి ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలను అదనంగా ప్రారంభించాలన్నారు. ప్రతీ గ్రామంలో నర్సరీ పెంచి వచ్చే ఏడాది నుంచి ఏడాదికి వంద కోట్ల మొక్కలు నాటే లక్ష్యంతో తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. 

2018-19 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో తెలంగాణ రాష్ట్ర ఆదాయాభివృద్ధి రేటు 19.83 శాతం నమోదు కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రగతి భవన్ లో శుక్రవారం వివిధ అంశాలపై కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు ఈటెల రాజేందర్, సి.లక్ష్మారెడ్డి, జోగు రామన్న, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు, శాంత కుమారి, బుర్రా వెంకటేశం, కార్యదర్శి భూపాల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

నేడు స్పీకర్ నేతృత్వంలో మంత్రుల సమావేశం....

బీసీ, ఎంబీసీల స్వయం ఉపాధి కోసం రూపొందించే పథకాలకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ముందుకు పోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. బ్యాంకులతో సంబంధం లేకుండానే లక్ష, రెండు లక్షల విలువ చేసే యూనిట్లను మంజూరు చేయాలని, దీనికి వంద శాతం ప్రభుత్వ గ్రాంటు ఇవ్వాలని ఆదేశించారు. బీసీ, ఎంబీసీలకు సంబంధించి పథకాల అమలుకు అవసరమైన వ్యూహాన్ని ఖరారు చేయడానికి శనివారం ఉదయం స్పీకర్ మధుసూదనాచారి సమక్షంలో సమావేశం కావాలని మంత్రులు, అధికారులను ఆదేశించారు. 

119 రెసిడెన్షియల్ పాఠశాలలే లక్ష్యం...

ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రారంభించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. ప్రతీ మండలానికి ఒక రెసిడెన్షియల్ పాఠశాల పెట్టే లక్ష్యం ప్రభుత్వానికి ఉందన్నారు. అందులో భాగంగా దశలవారీగా రెసిడెన్షియల్ పాఠశాలల సంఖ్య పెంచుతామన్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున కొత్తగా 119 రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించాలన్నారు. 

హరితహారంపై  విస్తృత స్థాయి సమీక్ష...

ఈ ఏడాది నిర్వహించే తెలంగాణకు హరితహారం కార్యక్రమంతో పాటు వచ్చే ఏడాది నుంచి అవలంభించాల్సిన వ్యూహం ఖరారు చేయడానికి శనివారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. అటవీ, పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖల మంత్రులు, అధికారులు ఈ సమావేశంలో పాల్గొనాలని కోరారు. వచ్చే ఏడాది నుంచి ఏడాదికి వంద కోట్ల చొప్పున మొక్కలు నాటేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని చెప్పారు. దీనికి అనుగుణంగా నర్సరీల సంఖ్యను పెంచాలని చెప్పారు.

19.83 శాతం ఆదాయాభివృద్ధి...

2018-19 ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో తెలంగాణ ఆదాయం 19.83 శాతం వృద్ధి రేటు సాధించినట్లు అధికారులు కేసీఆర్‌కు వివరించారు. గడిచిన నాలుగు ఆర్థిక సంవత్సరాలలో దేశంలోనే అత్యధిక ఆదాయ వృద్ధిరేటు నమోదు చేసిన తెలంగాణ రాష్ట్రం 2018-19 ఆర్థిక సంవత్సరంలో కూడా అదే దిశగా పయనించడం శుభసూచకమన్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో తెలంగాణలో 13,374.25 కోట్ల ఆదాయం రాగా, 2018-19 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 16,026.63 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post