ఇంకా సందిగ్దంలోనే ఆ ఉద్యోగుల భవిష్యత్తు

ఇంకా సందిగ్దంలోనే ఆ ఉద్యోగుల భవిష్యత్తు
ఇంకా సందిగ్దంలోనే ఆ ఉద్యోగుల భవిష్యత్తు
తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న 1253 మంది విద్యుత్‌ ఉద్యోగులకు జీతాల విషయంలో సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించినప్పటికీ వారి భవిష్యత్తు ఇంకా సందిగ్దంలోనే ఉంది. ఈ సమస్య వివరాల్లోకి చూస్తే....

ఆంధ్రప్రదేశ్ స్థానికత కలిగి తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న 1253 మంది విద్యుత్ ఉద్యోగులను తెలంగాణా ప్రభుత్వం విధులనుండి తొలగించింది. వారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధుల్లోకి తీసుకోవటానికి నిరాకరించింది. వారు హైకోర్ట్ ను ఆశ్రయించగా తాత్కాలికంగా వారిని మళ్ళీ ఉద్యోగాలలోకి  తీసుకోవాలని ఆదేశిస్తూ, జీతాల్ని మాత్రం 58:42 నిష్పత్తిలో పంచుకోవాలని సూచించింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణాలో పనిచేసేవారికి తాము జీతాలెందుకివ్వాలని కోర్టుకెక్కింది. ఉద్యోగులు కూడా తమకు ఏదో ఒక ప్రభుత్వమే జీతాలు చెల్లించాలని ఆదేశించాల్సిందిగా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. వారు ప్రస్తుతానికి తెలంగాణలో పనిచేస్తున్నందున ఆ రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం జీతాలు చెల్లించాలని కోర్టు ఆదేశాలిచ్చింది. కానీ ఆరు వారాల్లో వారి విభజన సమస్యను పరిష్కరించాలని కూడా పేర్కొంది.

సుప్రీమ్ కోర్ట్ జడ్జి ధర్మాధికారి ఆద్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల మధ్య మూడు రోజుల పాటు జరిగిన చర్చలు ఈ ప్రతిష్టంభన ను తొలగించలేకపోయాయి. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలు విభజన జరపటానికి వారు ప్రభుత్వ ఉద్యోగులు కాదనీ, కంపనీ ల చట్టం ప్రకారం ఏర్పడిన తెలంగాణ విద్యుత్ సంస్థలలో పనిచేసేవారని, తమకు ఈ విషయంతో సంబంధం లేదని వాదించాయి. తెలంగాణ విద్యుత్ సంస్థలు మాత్రం వారు ఆంధ్రప్రదేశ్ స్థానికులని, తాము తెలంగాణా వారికి ఉద్యోగావకాశాలు కల్పించవలసి ఉందని,  తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉద్యమం చేసినవారు తెలంగాణ ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేయలేరని వాదించాయి. దీనితో జడ్జి నేతృత్వం లోని పానెల్ ఏప్రిల్ 30 మరియు మే 1 వ తేదీలకు సమావేశాన్ని వాయిదా వేస్తూ అప్పటిలోగా ఒక నిర్ణయానికి రావాలని సంస్థలకు సూచించింది.

0/Post a Comment/Comments

Previous Post Next Post