మళ్ళీ కాపాడేసారే

మళ్ళీ కాపాడేసారే
మళ్ళీ కాపాడేసారే
తెలుగు దేశం ప్రభుత్వం, పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు పడకుండా మళ్ళీ కాపాడుకోగలిగింది. ద్రవ్య వినిమయ బిల్లు పై శాసన సభలో డివిజన్ (వోటింగ్) లేకుండా, మూజువాణి ఓటుతో ఆమోదం పొందినట్లు స్పీకర్ కోడెల శివప్రసాదరావు బుధవారం ప్రకటించటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చివరి ప్రయత్నం కూడా నీరుగారిపోయింది. ప్రతిపక్షం నుండి అధికార పక్షానికి ఫిరాయించిన ఎమ్మెల్యేల పై అనర్హత వేటు వేయించాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ బడ్జెట్ సమావేశాలలో మూడు సార్లు ప్రయత్నించి విఫలమైంది.

మొదటి ప్రయత్నంగా ప్రతిపక్షం ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానం పెట్టింది. అవిశ్వాస తీర్మానం పై నోటీసు ఇవ్వగానే, సామాన్యంగా అది ఎప్పుడు చర్చకు వస్తుందో ఆ తేదిని ప్రకటిస్తారు. దానితో ప్రతిపక్షానికి విప్ జారీ చేసే సమయం ఉంటుంది. కానీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించి అప్పటికప్పుడే చర్చను ప్రారంభించి వోటింగ్ లేకుండా మూజువాణి ఓటుతో వీగిపోయినట్టు ప్రకటించింది.

దానితో స్పీకర్ పక్షపాతంగా వ్యవహరించారని ఆరోపిస్తూ, రెండవ ప్రయత్నంగా స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టారు. ప్రభుత్వం మళ్లీ విప్ కోసం సమయం గానీ, డివిజన్ కు అవకాశం గానీ ఇవ్వకుండా మూజువాణి ఓటుతో వీగిపోయినట్టు ప్రకటించటంతో రెండవ ప్రయత్నం కూడా విఫలమైంది. 

అయితే రెండు ప్రయత్నాలు విఫలమవటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించి, ద్రవ్య వినిమయ బిల్లు పై ఓటింగ్ జరపాలని స్పీకరుకు ముందే నోటీసు ఇచ్చింది. అలాగే పార్టీ గుర్తు పైన గెలిచిన సభ్యులందరికీ బిల్లు పై చర్చకు హాజరు కావాలనీ, దానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని కూడా విప్ జారీ చేసింది. అయితే అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై ఓటింగ్ జరిగితే, టీడీపీలో కొత్తగా చేరిన ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతుగా ఓట్లేస్తే వారు అనర్హులవుతారు. అందుకే ఓటింగ్‌ పెట్టకుండా మూజువాణి ఓటుతో ఆమోదం పొందినట్లు ప్రకటించారు.

దీనికి స్పీకర్ చెప్పిన కారణం ద్రవ్య వినిమయ బిల్లుపై ఇంతకు ముందెప్పుడూ ఓటింగ్ జరగలేదు. కానీ సభ నియమాల ప్రకారం, ఏ సభ్యుడికైనా ఓటింగ్ పెట్టాలని కోరే హక్కు ఉంటుంది. ప్రతిపక్షం ముందే నోటీసు ఇచ్చినా డివిజన్ కు వెళ్లకపోవటం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీ  ఫిరాయించిన ఎమ్మెల్యేలు అనర్హులు కాకుండా కాపాడుకునేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు స్పీకర్‌ను అడ్డం పెట్టుకొని ఓటింగ్ లేకుండా చేశారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. స్పీకర్ ఓటింగ్‌కు అనుమతించకపోవడంపై కోర్టుకు వెళతామని కూడా తెలిపారు. అయితే సభకు హాజరు కాకపోవటం కూడా విప్ ఉల్లంఘన కిందకే వస్తుందనీ, దాని ప్రకారం కూడా అనర్హత వర్తిస్తుందా అనే విషయం పైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో అంతర్గతంగా చర్చిస్తున్నారు. ఏది ఏమయినా, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను మూడు సార్లు ప్రభుత్వం అనర్హత వేటు పడకుండా కాపాడుకోగలిగింది.

0/Post a Comment/Comments

Previous Post Next Post